భారత్లో ఎబోలా లేదు.. ఆందోళన వద్దు..!
బెంగళూరు అనుమానిత కేసుపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టత.. నిరంతర నిఘా
ఆఫ్రికా ఖండంలో వణికిస్తున్న ప్రాణాంతక 'ఎబోలా' వైరస్ దేశంలోకి ప్రవేశించిందా అనే అనుమానాలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం భారతదేశంలో ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందని పేర్కొంది.
అప్రమత్తంగా ఆరోగ్య శాఖ..
ఇటీవల ఉగాండా నుంచి బెంగళూరుకు వచ్చిన ఒక ప్రయాణికురాలికి స్వల్పంగా ఒళ్లు నొప్పులు రావడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆమెను బెంగళూరులోని ప్రభుత్వ అంటువ్యాధుల ఆసుపత్రి (Epidemic Diseases Hospital) లో ప్రత్యేక నిఘా ఉంచి, వైద్య పరిశీలనలో ఉంచినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.
"సదరు మహిళ ఆరోగ్యం ప్రస్తుతం పూర్తిగా స్థిరంగానే ఉంది. ఒళ్లు నొప్పులు మినహా ఎలాంటి తీవ్రమైన అనారోగ్య లక్షణాలు లేవు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఆమె నమూనాలను సేకరించి, ల్యాబొరేటరీ పరీక్షల కోసం పుణెలోని 'నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ' (NIV) కి పంపినట్లుకేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక వర్గాలు తెలిపాయి.
విమానాశ్రయాల్లో ముందస్తు తనిఖీలు..
ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాలలో ఎబోలా కొత్త స్ట్రెయిన్ వేగంగా విస్తరిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో నిఘాను ముమ్మరం చేసింది. ముఖ్యంగా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బెంగళూరు కేసు విషయంలోనూ అధికారులు ప్రోటోకాల్ను పక్కాగా పాటిస్తున్నారని, నివేదికలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

