హెల్త్ ఎక్స్ పర్ట్ : కరోనా మహమ్మారి సృష్టించిన భయాల నుంచి ప్రపంచం ఇప్పుడిప్పు డే కోలుకుంటుండగా.. ఆఫ్రికా ఖండంలో మరో ప్రాణాంతక వైరస్ శరవేగంగా విస్తరిస్తూ కలకలం రేపుతోంది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్సీ), ఉగాండా దేశాల్లో ఎబోలా వైరస్ తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయెసస్ రంగంలోకి దిగారు. అక్కడ నెలకొన్న తీవ్ర పరిస్థితుల దృష్ట్యా దీనిని "అంతర్జాతీయ ఆందోళనకర ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి" (PHEIC) గా అధికారికంగా ప్రకటించారు.
ఆఫ్రికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాల (ఆఫ్రికా CDC) గణాంకాల ప్రకారం.. కాంగో తూర్పు ప్రావిన్స్ అయిన ఇటూరి పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే 336 అనుమానాస్పద కేసులు, 88 మరణాలు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఎలా వ్యాపిస్తుంది..? దీని లక్షణాలేంటి..?
ఎబోలా అనేది అత్యంత వేగంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే ప్రమాదకరమైన అంటువ్యాధి. ఈ వైరస్ బారిన పడిన రోగి శరీర ద్రవాల, వాంతులు, రక్తం, లాలాజలం లేదా వీర్యం ద్వారా ఇది ఇతరులకు అత్యంత సులభంగా సంక్రమిస్తుంది.
ఈ వ్యాధి అరుదుగా వచ్చేదే అయినప్పటికీ, శరీర రక్షణ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసి, అంతర్గత అవయవాల వైఫల్యానికి దారితీస్తుంది. ఇది సోకిన వారిలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది.
పొరుగు దేశాలకూ విస్తరణ..
కాంగోలోని ఇటూరి ప్రావిన్స్లో వెలుగుచూసిన ఈ మహమ్మారి.. క్రమంగా పొరుగు దేశాలకూ పాకుతోంది. కాంగోతో సరిహద్దులు పంచుకుంటున్న ఉగాండాలో ఇప్పటికే రెండు ఎబోలా కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించింది. కాంగో, ఉగాండాతో పాటు దక్షిణ సూడాన్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా నిఘా తీవ్రం చేశారు.
లాక్డౌన్లు వద్దు.. డబ్ల్యూహెచ్ఓ స్పష్టీకరణ..
ప్రస్తుత ఎబోలా వ్యాప్తి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ.. ఇది గతంలో వచ్చిన కోవిడ్-19 తరహాలో ప్రపంచవ్యాప్త ముప్పు (పాండమిక్) కలిగించే ప్రమాణాలను తాకలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సామాజిక మాధ్యమాల ద్వారా స్పష్టం చేసింది.
వైరస్ భయంతో దేశాలు తమ అంతర్జాతీయ సరిహద్దులను మూసివేయడం లేదా ప్రయాణాలపై కఠినమైన ఆంక్షలు విధించడం వంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించింది.
సరిహద్దులు మూసివేస్తే నిఘా లేని దొంగచాటు ప్రయాణాలు పెరిగి, వైరస్ గుర్తింపు మరింత కష్టతరంగా మారుతుందని హెచ్చరించింది.
అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు, ముఖ్యంగా ఆఫ్రికా దేశాల సరిహద్దు ప్రాంతాలకు వెళ్లేవారు ఆరోగ్య నిపుణులు జారీ చేసే కోవిడ్ ,ఎబోలా నివారణ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. ఏ చిన్న అనుమానాస్పద లక్షణాలు కనిపించినా తక్షణమే వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.


